30 July, 2026 | 4:18 PM

కేటీపీపీలో 33వ రోజు నిరసన

30-07-2026 03:42 PM

ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయాలని డిమాండ్

గణపురం,(విజయక్రాంతి): కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీలో టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో 33వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ విభాగాల ప్రైవేటీకరణ టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీపీపీ ప్రధాన ద్వారం వద్ద గురువారం  ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడాలని, శాశ్వత ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు.

వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల బలోపేతమే రాష్ట్ర విద్యుత్ రంగానికి మేలు చేస్తుందని తెలిపారు. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భద్రతకు భంగం కలిగే అవకాశమున్నదని, విద్యుత్ రంగం నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యాదాద్రి తాప విద్యుత్ కేంద్రంలోని ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ ప్రైవేటీకరణ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీజీపీఈజేఏసీ అనుబంధ సంఘాలు, సంఘాల నాయకులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.