04-12-2025 01:39:44 AM
కాకతీయ యూనివర్సిటీ, డిసెంబర్ 3 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ కాంపస్ లో నెట్ వర్క్ వ్యవస్థను ఆధునికీకరించి, మరింత సమర్థవంతంగా మార్చేందుకు కాకతీయ విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ రంగ సంస్థ బీ.ఎస్.ఎన్.ఎల్ కు వర్క్ ఆర్డర్ను జారీ చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తెలిపారు.
ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ నుంచి జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి. కిషన్, అసిస్టెంట్ జనరల్ మానేజర్ సురేష్, రజనికర్ రెడ్డి, డివిజనల్ ఇంజనీర్ లతో పాటు, విశ్వవిద్యాలయ తరఫున రూసా నోడల్ అధికారి ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి, అభివృద్ధి అధికారి ఆచార్య ఎన్. వాసుదేవ రెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. బి. రమ, కాంపస్ నెట్వర్కింగ్ సంచాలకులు డా. డి. రమేష్ పాల్గొన్నారు. వారి సమక్షంలో వర్క్ ఆర్డర్కు సంబంధించిన విధులు, విధానాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం హాజరయ్యారు. రూసా నిధులతో విశ్వవిద్యాలయ కే హబ్ లో స్టార్ట్అప్స్ అంకుర సంస్థలను ప్రోత్సహించడం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, క్యాంపస్లో ఇంటర్నెట్ సదుపాయాలను మరింత మెరుగుపరచడం, రూసా అనుమతి పొందిన, మంజూరైన ప్రాజెక్టులకు, అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న రీసెర్చ్ ప్రాజెక్టులకు అవసరమైన నెట్వర్క్ మద్దతును విస్తరించడం లక్ష్యంగా ఈ వర్క్ ఆర్డర్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాంపస్ నెట్వర్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి బీ.ఎస్.ఎన్.ఎల్ సహకారం తో రూ. 1 కోటి 29 లక్షలు వెచ్చించనున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.