calender_icon.png 26 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో దిగిన ఎల్ & టీ

26-09-2025 01:08:59 AM

మొదటి దశ నుంచి అవుట్

అంతేగా.. అంతేగా..

13 వేల కోట్ల అప్పు టేకోవర్

2,100 కోట్ల నగదు చెల్లింపు

టేకోవర్ చేయనున్న రా్రష్ట్ర ప్రభుత్వం

  1. సర్కార్ కీలక నిర్ణయం 
  2. రెండో దశ విస్తరణ వేగవంతం చేయాలి
  3. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు.. ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులకు మధ్య గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కీలక చర్చలు జరిగాయి. మెట్రో ఫేజ్-1లో తమకున్న మొత్తం వాటాను రాష్ర్ట ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఇప్పుడు ఎల్‌అండ్‌టీ మెట్రోపై ప్రస్తుతం ఉన్న దాదాపు రూ.13,000 కోట్ల అప్పును రాష్ర్ట ప్రభుత్వం స్వీకరించనుంది. దీంతో పాటు తమ కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ.2,100 కోట్ల నగదును వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతిపాదించింది. ఈ చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మెట్రో మొదటి దశ మొత్తం రాష్ర్ట ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది. 2014లో దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్, ప్రస్తుతం తొమ్మిదవ స్థానానికి పడిపోయింది.

హైదరాబాద్ గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా రాష్ర్ట ప్రభుత్వం మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫేజ్ 2ఏ, 2బీ విస్తరణలో భాగంగా ఎనిమిది కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 163 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ర్ట ప్రభుత్వం పంపిన మెట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్-1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్-2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా ఒప్పందం కావాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్ కూడా ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రప్రభుత్వం ఫేజ్-1 విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది.

కీలక సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్ పాల్గొన్నారు. ఎల్‌అండ్‌టీ గ్రూప్ సీఎండీ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్, సీఎండీ సలహాదారు డీకే సేన్, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం ప్రత్యేక చొరవ.. 

కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్టంబననుఅధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్-2లోనూ ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉంటే బాగుంటుందని, రాష్ర్ట ప్రభుత్వం అందుకు తగినంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఫేజ్-1, ఫేజ్-2 కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు ఖచ్చితమైన ఒప్పందం అవసరమని సీఎం సూచించారు.

ఈ ఒప్పందం కుదిరితేనే విస్తరించే రైలు కార్యకలాపాలు సజావు గా సాగుతాయని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని సీఎం పేర్కొన్నారు. రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ తప్పుకున్నందు వల్ల కంపెనీ ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదని ఎల్‌అండ్‌టీ సీఎండీ తెలిపారు. 2022, జూలై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన రూ.3,000 కోట్ల వడ్డీ లేని రుణంలో రూ.2100 కోట్లు బకాయి ఉందని గుర్తు చేశారు.

చర్చల అనంతరం రాష్ర్ట ప్రభుత్వం ఫేజ్-1 మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు.