13-10-2025 12:00:00 AM
ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 12, (విజయక్రాంతి): దీపావళి పండుగ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తుచేసుకొని అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారులను సంప్రదించాలన్నారు.
ఎవరైనా సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు - 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టపాకాయల దుకాణాదారులు తప్పక ఈ నిబంధనలు పాటించాలన్నారు. టపాకాయల దుకాణాలు సంబందిత నిర్ణయించిన ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెను.
ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందుపర్చాలి. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదు. జనావాస ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో , సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు.
తాత్కాలిక టపాకాయల దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించకుండా దుకాణదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంభంధిత అన్ని శాఖల నుండి అనుమతి పత్రాలను పొందిన తర్వాతనే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. దుకాణదారులు తమ సమీపంలో ఇసుక , తగినంత నీటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.