calender_icon.png 6 June, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ మధ్యలో ట్రంప్ ఎవరు?

17-05-2025 12:11:17 AM

ట్రంప్ పోకడలపై  ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ గళమెత్త్తుతున్నాయి. భారత్ విదేశాంగ విధానంలో ట్రంప్ జోక్యాన్ని ఎదిరించక పోతే ఎలా అంటూ మోదీపై విరుచుకుపడుతున్నాయి. మన దేశపు నిర్ణయాధికారంపై ట్రంప్ పెత్తనమెంటని ప్రశ్నిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీస్తున్నాయి. 

ఈ అంశంపై మోదీ మౌనం వహిస్తే భారత సార్వభౌమాధికారాన్ని అమెరికా చేతికి అప్పగించినట్లు కాదా? అంటూ  ప్రశ్నిస్తున్నాయి. 

‘పాక్-  భారత్ మధ్య కశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎవరు ఆహ్వానించారు? ఎవరూ పిలవనిదే ఆయనెందుకు జోక్యం చేసుకున్నా రు? భారత్, పాకిస్థాన్ దేశాలతో అమెరికా కలిసి పనిచేస్తుందని ఎలా అనగలిగాడు? ఇరుదేశాలు  సరస్పరం దాడులు చేసుకుంటున్న క్రమంలో ‘కాల్పుల విరమణకు నేనే ఆదేశించాను.

లేదంటే వాణిజ్యాన్ని బంద్ పెడతాను’ అని ఎలా ప్రకటించగలిగాడు? ట్రంప్ ప్రకటించిన కొద్ది సమయంలోనే పాకిస్థాన్, ఆ వెనువెంటనే భారత్ కాల్పులకు విరామం ఎందుకు ప్రకటించాయి. ట్రంప్ అంతటితో ఆగకుండా ‘భారత్, పాక్ మధ్య కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలతో కలిసి పనిచేస్తాం” అని నొక్కి చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు.

‘వెయ్యి సంవత్సరాల తర్వాత కశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందేమో చూసేందుకు మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను. ఈ గొప్పపని చేసినందుకు భారత్, పాక్ నాయకత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు.

భారత్, పాకిస్థాన్ దేశాలు బలమైన, అచెంచల నాయకత్వ పటిమని కలిగి ఉన్నాయని, అందుకు నేనెంతో గర్విస్తున్నా. అయితే.. రెండు దేశాలు తలపడితే ఎంతోమంది మరణాలు సంభవిస్తాయి. అందుకే దాడులకు పుల్‌స్టాప్ పెట్టాల్సి ఉంది. ఇదే విషయాన్ని రెండు దేశాలూ గుర్తించాయి కూడా’ అని చెప్పుకొచ్చారు. ఇరుదేశాల నేతలు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.

ఈ వ్యాఖ్యల ద్వారా ట్రంప్ ప్రపంచానికి చెప్పదలుచుకున్నారంటే.. భారత్, పాక్ జుట్లు తన చేతిలో ఉన్నాయని. రెండూ దేశాలూ తమ జుట్లు స్వచ్ఛందంగా అమెరికాకు అప్పగించాయని. ట్రంప్ ప్రకటనను ఇటు భారత్ కానీ, అటు పాకిస్థాన్ కానీ ఖండించింది లేదు. పాకిస్థాన్‌కు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే నేషనల్ కమాండ్ అథారిటీతో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశానికి సిద్ధమైన నేపథ్యంలో ట్రంప్ ప్రకటనలు చేయడం గమనార్హం. అయితే, పాక్ రక్షణ మంత్రి భావాజా ఆసిఫ్ మాత్రం ఇలాంటి సమావేశమేదీ జరగలేదని బుకాయించారు. 

పాక్ స్పష్టంగా ట్రంప్ వ్యాఖ్యల సమర్థన

‘మీ ధైర్యవంతమైన చర్యలతో మీ వారసత్వం ఎంతగానో పెరిగింది. చారిత్రక, వీరోచిత నిర్ణయానికి అమెరికా సాయం చేసినందుకు గర్వంగా ఉంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. పైగా కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ ప్రకటనను పాకిస్థాన్ స్వాగతించింది. అంతేకాదు దక్షిణాసియా, దాని ఆవల శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న దీర్ఘకాల సమస్య అయిన కశ్మీర్ వివాద పరిష్కారానికి ట్రంప్ తన సంసిద్ధతను వ్యక్తం చేయడాన్ని తాము అభినం దిస్తున్నట్టు ప్రకటించింది.

కశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వత పరిష్కారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఉండాలని, కశ్మీరీ ప్రజల ప్రాథమిక హక్కులు, వారి స్వయం నిర్ణయాధికార హక్కునూ సాధించేలా చూడాలని పాక్ నొక్కి చెప్పింది. ప్రపంచ శాంతికి ట్రంప్ మార్గదర్శక నాయకత్వం, నిబద్ధత, దక్షిణాసియాకు శాశ్వత శాంతిని తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించాలనే ట్రంప్ అత్యంత విలువైన ప్రతిపాదన కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

‘దశాబ్దాలుగా పాక్, అమెరికా దేశాలు పరస్ప ర ప్రయోజనాలను రక్షించుకునేందుకు, ప్రపంచంలోని కీలక ప్రాంతాల్లో శాంతి, భద్రత కోసం భాగస్వాములుగా ఉన్నా యి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ -యూఎస్ సంబంధాలను బలోపేతం చేయగల గొప్ప భాగస్వామి అని పాక్ కనుగొన్నది. వాణిజ్యం, పెట్టుబడుల్లో మాత్రమే కాకుండా సహకారానికి సంబంధించి అన్ని రంగాల్లోనూ అమెరికాతో భాగస్వామ్యం ఉంటుంది’ అని షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. 

ప్రతిపక్షాల ఘాటైన విమర్శలు..

ట్రంప్ పోకడలపై  ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ గళమెత్తుతున్నాయి. భారత్ విదేశాంగ విధానంలో ట్రంప్ జోక్యాన్ని ఎదిరించక పోతే ఎలా అంటూ మోదీపై విరుచుకుపడుతున్నాయి. మన దేశపు నిర్ణయాధికా రంపై ట్రంప్ పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీస్తున్నాయి. ఈ అంశంపై మోదీ మౌనం వహి స్తే భారత సార్వభౌమాధికారాన్ని అమెరికా చేతికి అప్పగించినట్లు కాదా? అంటూ  ప్రశ్నిస్తున్నాయి.

భారత్, పాకిస్థాన్ మధ్య మధ్య వర్తిత్వం చేస్తానని అమెరికా ఎందుకు చెప్పాలంటూ నిప్పులు చెరుగుతున్నాయి. పాకి స్థాన్‌తో యుద్ధం చేసి, గెలిచే అవకాశం వందకు వందశాతం ఉన్న పరిస్థితుల్లో హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇరు దేశాల సమస్యలపై ద్వుపాక్షికంగానే చర్చలు జరపాలంటూ రెండు దేశాలు గతంలో సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు వదిలేసింది? మూడో దేశం జోక్యానికి ఎందుకు తలుపులు బార్లా తెరిచింది?’ అని ప్రశ్నించాయి. 

పార్లమెంట్ సమావేశాలకు డిమాండ్

పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూ ర్ చేపట్టిన తర్వాత వాటిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అలాగే పార్లమెంట్‌లో ప్రత్యేక సమా వేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. కాల్పుల విరమణపై వాషింగ్టన్ నుంచి తొలి ప్రకటన వెలువడటం, తర్వాతే భారత్, పాకిస్థాన్ స్పందించడం తదితర విషయాలపై కూలంకషంగా చర్చించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు సైతం రాశారు. 

భారతదేశానికే అవమానం?

కాల్పుల విరమణపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశానికే అవమానకరమని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ వ్యా ఖ్యానించారు. ‘మీకు ధైర్యం ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ సమావేశానికి ప్రధాని మోదీ కచ్చితంగా హాజరు కావాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ట్రంప్ జోక్యం కారణంగా యుద్ధాన్ని ఆపేసినట్టు ప్రభుత్వం చెబుతున్నదని, అలాంట ప్పుడు ఎన్నాళ్ల నుంచో జరుగుతున్న ఇజ్రాయెల్ -గాజా యుద్ధాన్ని ట్రంప్ ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు.

ట్రంప్ జోక్యం మన దేశ సార్వభౌమత్వంపై దాడేనని, ఇది మన ప్రభుత్వ బలహీనతను చూపుతున్నదని ఆయన అన్నారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ కేఝా స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య వివాదంలో మూడో దేశం జోక్యం సహించరానిదని అభిప్రాయపడ్డా రు. ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జీ దేవరాజన్ మాట్లాడుతూ.. ప్రాంతీయ వివాదంలో బాహ్యశక్తుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించ కూడదని పేర్కొన్నారు. ఇలా ఎంతోమంది ప్రతిపక్ష, విపక్ష నేతలు, ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాల్పుల విరమణ నిర్ణయంలో ట్రంప్ జోక్యాన్ని తప్పుబడుతున్నారు. 

వ్యాసకర్త సెల్: 98493 28496