calender_icon.png 30 September, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాగౌరి దేవిగా వనదుర్గమ్మ..

30-09-2025 02:09:45 PM

కన్నుల పండువగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

పాపన్నపేట,(విజయక్రాంతి): మంజీరా ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రసిద్ధమైన ప్రాంతం.. జనమే జయముని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. 9వ రోజు మంగళవారం అష్టమి పురస్కరించుకొని వనదుర్గామాతను దుర్గాదేవి (మహాగౌరి) రూపంలో, ఎరుపు రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి ఎరుపు రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. జిల్లాలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మను దర్శించి తరిస్తున్నారు. మొక్కులు చెల్లించుకొని చల్లంగా చూడమ్మా.. దుర్గమ్మ తల్లి.. అంటూ వేడుకుంటున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

నేడు మహిషాసురమర్దిని దేవిగా వనదుర్గమ్మ దర్శనం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 10వ రోజైన బుధవారం వనదుర్గామాత మహిషాసురమర్దిని (సిద్ధిరాత్రి) దేవి రూపం, మెరూన్ రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, అర్చకులు తెలిపారు.