వైభవంగా మహంకాళి బోనాలు
భిక్కనూర్, జూలై 19(విజయ క్రాంతి): ఆషాఢమాసం సందర్భంగా భిక్కనూర్ మండల కేంద్రంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు రంగురంగుల బోనాలతో ఊరేగింపులో పాల్గొనగా, డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, డీజే సౌండ్కు యువత నృత్యాలు, బాణసంచా సందడి భక్తులను ఆకట్టుకున్నాయి. మున్నూరు కాపు సంఘం, నాయి బ్రాహ్మణ సేవా సంఘం, కుమ్మరి సంఘాల ఆధ్వర్యంలో భక్తులు వేర్వేరుగా బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
సుభాష్ చౌరస్తా మీదుగా సాగిన బోనాల ఊరేగింపు ఊరడమ్మ ఆలయం, అనంతరం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని మహంకాళి అమ్మవారు, భూలక్ష్మమ్మ ఆలయాలకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం గ్రామదేవతలకు కూడా సంప్రదాయబద్ధంగా బోనాల సమర్పణ నిర్వహించారు. బోనాల వేడుకలతో భిక్కనూర్ పట్టణమంతా ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో కళకళలాడింది.






