30-10-2025 08:43:38 PM
అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
రేగొండ (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి 94వ డివిజన్ షేక్పేట లోని 35, 36, 37, 38 పోలింగ్ బూత్(హజీజ్ బాగ్, అరవింద్ నగర్ కాలనీ)లలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని తదితరులతో కలిసి గల్లీ గల్లీ కలియ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. బడుగు, బలహీన వర్గానికి చెందిన సోదరుడు నవీన్ యాదవ్ కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా చేస్తాడని ఎమ్మెల్యే అన్నారు.