09-06-2025 11:42:40 AM
వీడ్కోలు పలికిన విరసం నేతలు, బోథ్ ఎమ్మెల్యే...
అదిలాబాద్, (విజయక్రాంతి): "వీరులు అమరులు మీరు" అంటూ ఉద్యమ పాటలు పాడుతూ మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ కు విరసం నేతలు లాల్ సలాం చెబుతూ ఉద్యమ వీడ్కోలు(Mylarapu Adellu funeral) పలికారు. బీజాపూర్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు మృతదేహం ఆదివారం రాత్రి ఆయన స్వగ్రామమైన బోథ్ మండలం పొచ్చర కు చేరుకుంది. విగతజీవిగా ఉన్న అడెల్లు ను చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. అడెల్లు అమర్ రహే అంటూ నినాదాలతో గ్రామం మారుమోగింది.
30 ఏళ్ల కిందట గ్రామం విడిచి అడవి బాట పట్టి ఇప్పుడు విగతజీవిగా గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం నిర్వహించిన అడెల్లు అంత్యక్రియల్లో కమ్యూనిస్ట్ నాయకులు, విరసం నేతలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తరలివచ్చారు. అడెల్లు మృతదేహంపై ఎర్ర జెండాను కప్పి లాల్ సలాం కామ్రేడ్ అంటూ ఘన నివాళి అర్పించారు. అటు మావోయిస్టు నేత మైలారపు అడెల్లు అంత్యక్రియల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. అడెల్లు మృతదేహానికి నివాళ్ళు అర్పించారు.