01-06-2025 12:31:11 AM
ఆడిట్ రిపోర్టులో స్పష్టం.. విజిలెన్స్ విచారణ కోరుతాం
ఒక్కో ఉద్యోగిని లక్షా యాభైవేల జీతానికి తీసుకున్నారు
ఇదంతా అప్పటి సెక్రటరీ సంతకంతోనే జరిగింది
గతంలో పనిచేసిన వారు తలుచుకుంటే ఆహారంలో పురుగులు, ఎలుకలు, ఫుడ్పాయిజన్
మీడియా సమావేశంలో గురుకులాల కార్యదర్శి అలగు వర్షిణి
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఎస్సీ గురుకులాల్లో భారీ అవినీతి జరిగిందని.. ఇది వాస్తవమని ఆడిట్ రిపోర్ట్లోనూ తేలిందని, అప్పటి సెక్రటరీ సంతకంతోనే ఈ తతంగమంతా జరిగిందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిణి ఆరోపించారు. యేటా రూ.25 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్నది నిజమని, ఆడిట్ జనరల్ ఈ విషయాన్ని బయటపెట్టిందన్నారు.
శనివారం ఆమె మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ఎస్సీ గురుకులాల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ కోరుతామని, నిధులు పక్కదారి పట్టించేందుకు అడ్డగోలుగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగిని లక్ష యాభైవేల జీతానికి తీసుకున్నారని, వారు ఏం చేయాలో వారికే తెలియదన్నారు. ఇష్టానుసారంగా నచ్చిన వారిని నియమిం చుకున్నారని ఆరోపించారు.
వారిని తొలగిస్తే ప్రభుత్వానికి నెలకు రూ.9 కోట్లు మిగులుతాయన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్టు అవసరానికి మించి ఉద్యోగాలిచ్చారని వెల్లడిం చారు. ఒక్క గురుకులానికి ఎనిమిది మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారని, 360 మంది సబ్జెక్టు అసోసియేట్ పేరిట నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం తాము ఈరూ విధానం ద్వారా టెండర్లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
గురుకులాలపై రాజకీయం చేయొద్దు
గతంలో గురుకులాల్లో పని చేసిన వారి కనుసన్నల్లోనే కొందరు ఇంకా పని చేస్తున్నారని, వారు తలుచుకుంటే.. ఫుడ్ పాయిజన్ ఘటనలు.. ఆహారంలో పురుగులు, ఎలుకలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకులాలలో పిల్లలతో పరిశుధ్యం కార్యక్రమంపై అవగాహన కోసం తీసుకున్నామని, గురుకులాలపై దయచేసి రాజకీయం చేయొద్దని.. దండం పెడతానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మీ రాజకీయాల కోసం పిల్లలకు కులం అనే రంగు పూయకండని, రాజకీయ నాయకులకు ఆమె వేడుకున్నారు. గురుకుల విద్యార్థులను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిపి, ఈ రాష్ర్ట ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా వారిని తీర్చి దిద్దుతున్నామన్నారు. కావాలనే కొందరు తన మాటలను ఎడిటింగ్ చేసి చూపటం దుర్మారమన్నారు.
కాలేజీలను మూసేయడం లేదు
గురుకుల కాలేజీలను తగ్గిస్తున్నామనే ప్రచారాన్ని నమ్మొ ద్దని, అద్దె భవనాలకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అలుగు వర్షిణి చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ చరిత్రలోనే ఈ ఏడాది మే నెలలోనే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తుందని, 2016 2024 వరకు సగం సీట్లు కూడా భర్తీ కాలేదన్నారు. ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. డిగ్రీలో కొత్తగా 30 కొత్త కోర్సులు తీసుకొచ్చాం..
ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ తీసుకొచ్చామని వెల్లడించారు. గురుకులాల్లో చదివే విద్యార్థులందరిని తన బిడ్డలా చూసుకుంటున్నానని, వారంతా నన్ను అమ్మ అని పిలుస్తారన్నారు. పిల్లలు తమ పనులు తాము చేసుకోవాలని చెప్పడాన్ని కొందరు వేరేరకంగా అర్థం చేసుకోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.
ప్రతి ఏటా విద్యార్థులకు తెలంగాణ దర్శిని పేరిట అనేక పుణ్య క్షేత్రాలకు, పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్తున్నామని, కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ ఆరోపణలని కొట్టిపారేశారు.
కొంతమంది విద్యార్థుల విపరీత ప్రవర్తనల వల్ల ప్రిన్సిపాళ్లు ఇబ్బంది పడుతున్నారని, వారిపై దాడులు, దూషణలు చేస్తే షోకాజ్ నోటీసులిస్తామని చెప్పినట్టు ఆమె సమర్థించుకున్నారు. దీన్ని కావాలని కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో కొత్తగా టైం టేబుల్ను రూపొందించినట్లు వర్షిణి పేర్కొన్నారు.