01-06-2025 12:29:09 AM
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు అధికారుల కమిటీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావులతో కూడిన సబ్కమిటీకి శనివారం ప్రజాభవన్లో కలిసి నివేదికను సమర్పించింది.
అయి తే అధికారుల నుంచి నివేదికను స్వీకరించిన ఈ సబ్ కమిటీ, పూర్తిగా అధ్యయనం చేసి.. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించింది. పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బిల్లులు తదితర దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
వీరి సమస్యల పరిష్కారం కోసం సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్లతో అధికారుల కమిటీని ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ రెండు దఫాలు గా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలతో సమావేశమై, వారి సమస్యలపై విజ్ఞాపన పత్రాలు స్వీకరించింది.
సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ అధికారుల కమి టీ తాజాగా మంత్రుల సబ్ కమిటీకి నివేదికను సమర్పించింది. మే 29న సబ్ కమిటీ భేటీ అవ్వాలని భావించింది. కానీ అది వా యిదా పడింది. ఒకట్రెండు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మొదటి నుంచి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మొత్తం 57 డిమాండ్లను పరి ష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇందులో ప్రధానంగా డీఏల విడుదల, రూ.10 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లుల చెల్లింపు, 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, ప్రభుత్వం సమాన వాటాతో ఉద్యోగుల ఆరోగ్య పథకం లాంటి డిమాండ్లతోపాటు ఆర్థికేతర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ముందు నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో 25 డిమాండ్ల పట్ల అధికారుల కమిటీ సానుకూలంగా ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో రెండైనా ఇవ్వాలని కమిటీని ఇప్పటికే కోరారు. అయితే ఈ డీఏల విడుదలపైన ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. మొత్తం 57 సమస్యల్లో కొన్ని సమస్యలకు సంబంధించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.