11 April, 2026 | 3:07 AM

జగిత్యాలలో 20న భారీ బహిరంగ సభ

11-04-2026 01:04 AM

అన్నా.. దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని..

  1. ప్రజాక్షేత్రంలోకి త్వరలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 
  2. అదేరోజు మాజీమంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి..

గజ్వేల్, 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రానున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం లో బీఆర్‌ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ ఆయనతో భేటీ అయ్యారు. అనంత రం ఫామ్‌హౌస్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. ఈనెల 20వ తేదీ లోపే మాజీమంత్రి జీవన్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సమ క్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు కేసీఆర్‌ను జీవన్‌రెడ్డి కలిసి వెళ్లినట్లు తెలిపారు. జగిత్యాలలో భారీ బహి రంగ సభలో ఈ చేరికలు జరగనున్నాయని, రాష్ట్రంలో రైతు సమస్యలు, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ ఈ సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్లీనరీకి ముందే మరిన్ని చేరికలు ఉంటా యన్నారు. కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి జీవన్‌రెడ్డి ముందుకు వచ్చారని, ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఎల్ రమణ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని భావించి నప్పటికీ, ప్రభుత్వ పాలన తీరును పరిశీలించిన తర్వాత కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని, కోర్టుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేస్తామని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు.

కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ..

‘అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని’ అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. -బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఎర్రవెల్లి నివాసంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఎర్రవెల్లి నివా సానికి చేరుకున్న జీవన్‌రెడ్డికి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పుష్పగుచ్ఛాలందించి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కే సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. జీవన్‌రెడ్డితోపాటు వచ్చిన వారిలో వారి కుమా రులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులున్నారు.

అయితే కేసీఆర్‌తో కలిసిన సంద ర్భంలో జీవన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానినికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి జీవన్ రెడ్డి., తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు బీఆర్‌ఎస్ అధినేత కెసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవ సరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు.. అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’ అంటూ తన మనసులోని మాటను భావోద్వేగంతో వ్యక్తం చేశారు. 

కాగా జీవన్‌రెడ్డిని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ హృద యపూర్వకంగా ఆలింగనం చేసుకొని, దుశ్శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్‌రెడ్డి బృందాన్ని లంచ్‌కు కేసీఆర్ ఆహ్వానించారు. 

కాంగ్రెస్ పట్టుకోల్పోయింది..

కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టు కోల్పోయిందని, ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారని.. కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మాజీ సీఎం కేసీఆ ర్‌ను కలిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైందని, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా ’రూలర్’లా వ్యవహరిస్తున్నారు‘ అని ధ్వజమె త్తారు.

ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం సీఎం ఆదేశాలను అమలుచేసే ఒక విభాగంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘పీసీసీ చేసే తప్పులకు చివరకు ఏఐసీసీని నిందించడం సరికాదని హితవు పలికారు. పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందని విశ్లేషించారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎం దుకు వెళ్తున్నానో మీకే తెలియాలంటూ కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు.

తనకు 14 సార్లు బీఫామ్ ఇచ్చారంటే అది తన సమర్థత వల్లేనని.. తాను కంటెంట్ ఉన్న నాయకుడిని కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. అని ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. మిగిలిన రెండున్నరేళ్లు అయినా కాంగ్రెస్ సర్కార్ బాగా పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చింది 17 వేల ఉద్యోగాలేనని విమర్శించారు.

మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు.. రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అని అన్నారు, ఏమైంది? అని ప్రభు త్వాన్ని నిలదీశారు. పదవుల కోసమే బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లాలంటే తాను ఆరోజే వెళ్ళేవాడినని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించు కున్నానని జీవన్‌రెడ్డి తెలిపారు.

త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో తాను బీఆర్‌ఎస్‌లో చేరుతానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.  దాదాపు ౫ గంటలపాటు కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రావాలని జీవన్‌రెడ్డి ఆహ్వానించగా గులాబీ అధినేత సాను కూలంగా స్పందించారని సమాచారం.