11 April, 2026 | 3:07 AM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్

11-04-2026 01:10 AM

కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు

తాండూరు, ఏప్రిల్ 10,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని వారిపై తగు చర్యలు తీసుకొని అర్హులైన పేదలకు న్యాయం చేయాలి అంటూ బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్  కు ఫిర్యాదు చేశారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో  ఇల్లు లేని పేదల కోసం కట్టిన డబుల్ బెడ్ రూమ్ పంపకంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ,కార్యకర్తలు సూచించిన వారికి మాత్రమే మంజూరు చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజల చేత ఎన్నుకోబడిన తమకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.

ప్రతి వార్డు నుండి 12 మంది అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ చొప్పున కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, నాయకులకు, కార్యకర్తలకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డుల్లో సైతం తమను కాదని కనీస ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. తాండూర్ తాసిల్దారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ అర్హులైన పేద ప్రజల వైపు ఉండి పోరాటం చేస్తామన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు  యర్షాద్, జావిద్ ,సురేష్, యోగానంద్,  మరియు నాయకుల రుద్ర పాటిల్, సంతోష్ గౌడ్, ఎజాజ్, అనంతరెడ్డి, సంతోష్ తదితరులు ఉన్నారు.