న్యూఢిల్లీ: వాయువేగంతో బంతులు విసురుతూ అతి కొద్ది కాలంలోనే విమర్శకుల ప్రశంసలందుకున్న యువ పేసర్ మయాంక్ యాదవ్కు గాయాల బెడద వెంటాడుతోంది. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 ఏళ్ల మయాంక్.. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. నిలకడగా గంటకు 150 కిలీమీటర్లకు పైగా వేగంతో బంతులు వేసి ఆకట్టుకున్న మయాంక్.. గాయం తిరగబెట్టడంతో మిగిలిన మ్యాచ్ల్లో ఆడేది అనుమానంగా మారింది. ‘మయాంక్ గాయం తిరగబెట్టింది. దాని తీవ్రత గతం కన్నా అధికంగా ఉంది. దీంతో అతడు ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లు ఆడటం కష్టమే’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. బీసీసీఐ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న సమయంలో మయాంక్ మళ్లీ ఆటకు దూరమయ్యాడు. కాంట్రాక్ట్ లభిస్తే మయాంక్ ఆరోగ్య పరిస్థితిని జాతీయ క్రికెట్ అకాడమీ పర్యవేక్షించనుంది.