07-08-2025 06:33:15 PM
సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్..
సనత్నగర్ (విజయక్రాంతి): జీరో అంతరాయాలే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని, దానికి తగ్గట్టుగానే LT నెట్వర్క్ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ వరకు తనిఖీలు చేసి ఎమన్నా లోపాలు ఉంటే సరిదిద్దెందుకు గాను ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని గతంలో సూపెరింటెండింగ్ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖీ(CMD Shri Musharraf Farooqui) తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా సంస్థ సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్, డైరెక్టర్ ఆపరేషన్స్ డా. నర్సింహులుతో కలిసి ఈ రోజు గురువారం ఉదయం 8 గంటలకు బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని బోరబండ, బంజారాహిల్స్ సెక్షన్ పరిధిలోని పలు బస్తీల్లో చిన్న చిన్న గల్లీల్లో కాలినడకన పర్యటిస్తూ అక్కడి వినియోగదారులతో మాట్లాడుతూ LT నెట్వర్క్ ను తనిఖీ చేసారు.
వేలాడుతున్న స్టార్, ఇంటర్ నెట్ కేబుల్స్, విద్యుత్ తీగలు, జాయింట్లు వున్న కేబుల్స్ లను గుర్తించి మార్చమని ఆదేశించారు.సెక్షన్ అధికారులు (అసిస్టెంట్ ఇంజినీర్లు) ఉదయం ఎనిమిది గంటల నుండి తమ కార్యాచరణ మొదలు పెట్టాలని, ఏరియాల వారీగా LT నెట్వర్క్ లో పోల్ టు పోల్ తనిఖీలు చేయాలని ఎమన్నా లోపాలు ఉంటే సరి చేయాలన్నారు. విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న నిరంతర కృషి వలన 33 కేవీ, 11 కేవీ నెట్వర్క్ లో చాలా వరకు సమస్యలు తగ్గాయన్నారు. భారీ గాలులు, వర్షం వలన ఎక్కడైనా చెట్లు/వాటి కొమ్మలు విరిగి స్తంభాల పై పదైనపుడు సరఫరా సమస్యలు ఏర్పడుతున్నాయని, వాటిని సైతం అతి తక్కువ సమయంలో పరిష్కరిస్తున్నామని సీఎండీ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ పూర్తయ్యేవరకు తాను కూడా ప్రతి రోజు/ రోజు మార్చి రోజు క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎండీ తెలిపారు.సంస్థ సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖీ తో పాటు, సంస్థ డైరెక్టర్ డా. నరసింహులు, చీఫ్ ఇంజినీర్ మెట్రో శ్రీ ప్రభాకర్, బంజారాహిల్స్ ఎస్ ఈ శ్రీ కరుణాకర్ బాబు, బంజారాహిల్స్ డిఈ శ్రీ హనుమంత్ రెడ్డి , గ్రీన్ ల్యాండ్స్ డిఈ భీమ నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.