calender_icon.png 3 January, 2026 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి చర్యలు

03-01-2026 12:00:00 AM

కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి

హనుమకొండ, జనవరి 2 (విజయ క్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద, దినసరి వేతన అధ్యాపకుల సమస్యలను తమ పరిధిలో ఉన్న మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ కరుణాకర్ రావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ రాష్ట్రంలో  1976 కాలంలో కేవలం 3 కళాశాలలు మాత్రమే ఉండేవని, వాటిలో వరంగల్  ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల ఒకటని గుర్తు చేశారు. శతాబ్దానికి చేరువైన సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కళాశాల ఔన్నత్యాన్ని మరింత పెంపొందించేందుకు అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందిస్తున్న నూతన పాఠ్యప్రణాళిక విధానంలో నైపుణ్యాభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

దీనికి అనుగుణంగా ఆరట్స్, సామాజిక శాస్త్రాలు, వాణిజ్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర విభాగాలలో నూతన పాఠ్యప్రణాళికల రూపకల్పన చేపట్టాలని సూచించారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సౌకర్యాల కల్పనకు తక్షణమే చర్యలు చేపడతామని తెలిపారు. కళాశాల జాతీయ మూల్యాంకన గుర్తింపు సంస్థ (నాక్)  గుర్తింపుకు వెళ్లాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా అధ్యాపకులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానం కళాశాలలో అమలులోకి తీసుకొస్తున్నామని, ఇది పార్ట్ టైం, ఒప్పంద అధ్యాపకులకు కూడా వర్తిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ప్రొఫెసర్ రామచంద్రం, ప్రిన్సిపల్ జ్యోతి, డాక్టర్ కనకయ్య, డాక్టర్ శ్రీధర్ కుమార్, డాక్టర్ పుల్ల రమేష్, డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ జూల సత్యం, డాక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి, రిజిస్టర్ ఆచార్య రామచంద్రం లను ఘనంగా సత్కరించారు.