24 May, 2026 | 4:38 PM

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మెడికల్ కళాశాలకు పెట్టాలి

24-05-2026 03:35 PM

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కకు పద్మశాలి సంఘం నేతల వినతి

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ ప్రజానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అధికారికంగా నామకరణం చేయాలని పద్మశాలి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కకు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ నిజాం పాలనకు, రజాకారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే మెడికల్ కళాశాలకు ఆయన పేరు పెడతామని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసి హామీని అమలు చేయాలని కోరారు. ఆసిఫాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న పద్మశాలి సంఘ భవనం అసంపూర్తిగా ఉందని, భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై స్పందించిన ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి, సమాజానికి చేసిన సేవలు గొప్పవని అన్నారు. ఆయన పేరును మెడికల్ కళాశాలకు పెట్టే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అమలు జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పద్మశాలి సంఘ భవనం నిర్మాణానికి అవసరమైన సహకారం అందేలా ప్రయత్నిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు,  ఆసిఫాబాద్ పట్టణ అధ్యక్షుడు హనుమండ్ల శ్రీకాంత్, కార్యదర్శి శ్రీకాంత్‌,సంఘ నాయకులు లింగయ్య, ధర్మయ్య ,ప్రణయ్, రమేష్, అజయ్ ,తిరుపతి తదితరులు  పాల్గొన్నారు.