calender_icon.png 21 February, 2026 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108ను తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య అధికారి తుకారంరాథోడ్

21-02-2026 06:24:03 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం రోజున జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లాలో నడుస్తున్న 108 అంబులెన్స్ వాహనాలపై సమగ్ర తనిఖీ చేసి ఆడిట్ నిర్వహించారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సమర్థవంతంగా, వేగవంతంగా అందుతున్నాయా అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు.

తనిఖీ సందర్భంగా వాహనాల బయటి, లోపలి పరిస్థితి, టైర్లు (స్టెప్నీ సహా), హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, సైరన్, పీఏ సిస్టమ్ పనితీరు, జీపీఎస్ వ్యవస్థ పని స్థితి, ఇంధన స్థాయి, లాగ్‌బుక్ నిర్వహణను పరిశీలించారు. అదేవిధంగా ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ల చెల్లుబాటు స్థితిని ధృవీకరించారు.

వైద్య పరికరాలలో ఆక్సిజన్ సిలిండర్ ప్రెషర్ స్థాయి, బీవీఎం (వయోజనులు, పిల్లల కోసం), సక్షన్ యంత్రం, బీపీ యంత్రం, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, పల్స్ ఆక్సీమీటర్, స్ట్రెచర్, స్పైన్ బోర్డ్, సర్వైకల్ కాలర్లు, డెలివరీ కిట్, ఇతర అత్యవసర పరికరాలను తనిఖీ చేశారు.

అలాగే ఔషధ కిట్‌లో అడ్రినలిన్, అట్రోపిన్, డెక్స్ట్రోస్, ఐవీ ద్రావణాలు తదితర అత్యవసర మందుల లభ్యత గడువు తేదీలను పరిశీలించారు. అంబులెన్స్‌ల శుభ్రత, లీనెన్ పరిస్థితి, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ విధానం, పీపీఈ కిట్లు, హ్యాండ్ శానిటైజర్ల లభ్యతను కూడా ధృవీకరించారు. ప్రజలకు అత్యవసర సేవలు ఎటువంటి లోపాలు లేకుండా అందించాలనే ఉద్దేశంతో, ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు.