21-06-2025 06:25:42 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) (విజయకాంతి): వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, వ్యాధులు ప్రబలితే అత్యవసర వైద్య సేవలు అందించుట, డ్రై డే అమలు, వ్యక్తిగత పరిశుభ్రత, విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య, పంచాయతీరాజ్, మునిసిపల్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
గత 2 సంవత్సరాల డేటా ఆధారంగా వ్యాధులు ప్రబలిన హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో వైద్య క్యాంపులు నిర్వహించి వ్యాధులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తూ తక్షణ వైద్య అత్యవసర వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకొని, దోమల వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ, వార్డులలో మురుగునీరు నిల్వలు లేకుండా పరిశుభ్రం చేయాలని పంచాయతి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. తన అనుమతి లేకుండా సిబ్బందికి డిప్యూటేషన్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. మహిళా సమాఖ్యల సమావేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. టిబి విముక్త్ కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నవీన్ కుమార్, డిపిఓ వీరభద్రయ్య, డిఆర్డీఓ బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.