21-06-2025 06:27:56 PM
ప్రతి పేదోడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నం..
బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శంకర్..
హుస్నాబాద్: "ప్రతి పేదవాడికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. పేదరికాన్ని పోగొట్టడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం" అని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్(BJP District President Bairi Shankar) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శనివారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంతో దేశం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ మార్గంలో ముందుకు సాగిందన్నారు.
భారత్ ప్రతి సవాల్ను ధైర్యంగా ఎదుర్కొందని, మన సైనికుల సాహసంతో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు. "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్" "సబ్ కా ప్రయాస్, సబ్ కా విశ్వాస్" అనే నినాదాలతో ప్రతి పౌరుడిని అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చారని, దేశం మొత్తం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఏకతాటిపై ముందుకు సాగుతోందని వివరించారు. మోదీ ప్రభుత్వం అంత్యోదయ తత్వంతో పని చేస్తోందని తెలిపారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 81 కోట్ల మందికి ఉచితంగా బియ్యాన్ని అందించడం, స్వచ్ఛ భారత్ ద్వారా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి ఆరోగ్యం, గౌరవం పెంచడం వంటి పథకాలను ఉదహరించారు. ముద్ర యోజన, పీఎం స్వనిధి ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించిందని, మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
దేశ రక్షణలో విప్లవాత్మక మార్పులు
ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత రక్షణ ఎగుమతులు 34 రెట్లు పెరిగి రూ.23,622 కోట్లకు చేరాయన్నారు. ప్రచండ హెలికాప్టర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ వంటి స్వదేశీ అభివృద్ధి చేసిన ఆయుధాలను సైనికులు విజయవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ ప్రాంతంలో 9 ఉగ్రవాద శిబిరాలు, 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి, దేశ సైనికుల ధీరత్వాన్ని చాటాయని చెప్పారు.