4 March, 2026 | 9:18 PM

కుక్కర్ పేలుడుతో గాయపడ్డ మధ్యాహ్న భోజన వర్కర్‌

04-03-2026 07:41 PM

విధి నిర్వహణలో ప్రమాదం

బాధిత వర్కర్‌కు న్యాయం చేయాలంటూ సీఐటీయూ డిమాండ్

సిద్దిపేట రూరల్: నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వర్కర్‌గా పనిచేస్తున్న పిడిశెట్టి నరసవ్వ ఇటీవల విధులు నిర్వహిస్తున్న సమయంలో పప్పు కుక్కర్ పేలి తీవ్రంగా గాయపడిన ఘటనపై సీఐటీయూ నాయకులు స్పందించారు. గత వారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నరసవ్వకు గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని సీఐటీయూ జిల్లా నాయకులు చల్లారపు తిరుపతి రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు విద్యాధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించి, బాధిత కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.