26-06-2025 07:26:27 PM
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ అధినేత ఓవైసీ..
స్థానికసంస్థల, మున్సిపల్ ఎన్నికల వరకు ఎంఐఎంను బలోపేతం చేయాలి..
గులాం అహ్మద్ హుస్సేన్ కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఆదేశం..
కరీంనగర్ (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఎంఐఎం పార్టీని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంస్థాగతంగా బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సంస్థాగతంగా నిర్మాణ పరంగా బలోపేతం చేయాలని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi), ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ను ఆదేశించారు. గురువారం ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్లోని ఎంఐఎం పార్టీ జాతీయ కార్యాలయం దారుస్సలామ్ లో గులాం అహ్మద్ హుస్సేన్, ఎంఐఎం పార్టీ నగర సహాయ కార్యదర్శి హాఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ పార్టీల నుండి చేరబోయే వారిని ఎంఐఎం పార్టీలోకి ఆహ్వానించాలని ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, సిరిసిల్ల, హుజురాబాద్, జమ్మికుంట, వేములవాడ, కరీంనగర్ మున్సిపల్ పరిధిలో విస్తృతంగా చేరికల కార్యక్రమాన్ని చేపట్టాలని, తమ అధినేత ఓవైసీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని, గులాం అహ్మద్ వివరించారు. ఇతర పార్టీల నుండి చేరేవారికి ఎంఐఎంలో తలుపులు తెరిచి ఉన్నాయన్నాయన్నారు.
ఉమ్మడి జిల్లాలోని సెక్యులర్ నాయకులతోపాటు ఎస్సీ ఎస్టీ, బీసీ నాయకులను సైతం ఎంఐఎం లో చేరికలకు ఆహ్వానం ఉంటుందని సామాజిక న్యాయమే లక్ష్యంగా అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపల్ ఏరియాల్లో పర్యటించి ఎంఐఎంలో చేరబోయే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. జిల్లాలో నిర్ణయాత్మక శక్తిగా ఎంఐఎంను బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని తమ అధినేత ఆదేశించినట్లు తెలిపారు.