calender_icon.png 26 June, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

26-06-2025 07:32:33 PM

బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్..

మందమర్రి (విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతోనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సహకరించి భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్(ACP Ravi Kumar) కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పట్టణంలో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ" నిర్వహించారు. ఈ ర్యాలీని ఏసీపీ రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ నుండి మార్కెట్ వరకు ర్యాలీ కొనసాగింది. "మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి" వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు.

అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, "యాంటీ డ్రగ్ సోల్జర్స్"గా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై వారి ఉజ్వల భవిష్యత్తుకు ఆవరోధాలు సృష్టించుకోవద్దని సూచించారు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలనీ కోరారు. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తు పదార్థాల అమ్మకం వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు.

మాదక ద్రవ్యాల కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఉపాధ్యాయు లకు, యాంటీ-డ్రగ్ కమిటీలకు లేదా 100, 1908 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియ జేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా జీఎం జి దేవేందర్, పట్టణ సిఐ శశిధర్ రెడ్డి,సర్కిల్ పరిధిలోని ఎస్ఐ లు, సింగరేణి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు. ఉపాధ్యాయులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.