18 March, 2026 | 6:03 AM

మినీ బస్సు బోల్తా: పలువురికి గాయాలు

18-03-2026 12:00 AM

శేరిలింగంపల్లి, మార్చి 17 (విజయక్రాంతి): మియాపూర్ సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పిన ఓ మినీ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రైవేట్ ఉద్యోగులు స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం విధులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగించింది. లీ ఫార్మా సంస్థకు చెందిన మినీ బస్సులో సుమారు 10 మంది ఉద్యోగులు కేపీహెచ్బీ నుంచి గడ్డిపోచారం పరిశ్రమ ప్రాంతానికి వెళ్తున్నారు.

బాచుపల్లి దారిలో టాటా మోటార్స్ సమీపంలోని మలుపు వద్ద వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డుపై పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఒకరికి తలకు గాయం కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.