పెండింగ్ లో ఉన్న సాగునీటి పనులు పూర్తి చేస్తాం
స్తంభంపల్లి చెరువును పరిశీలించిన మంత్రి అడ్లూరి
ధర్మపురి,(విజయక్రాంతి): ధర్మపురి నియోజకవర్గo గోదావరి పక్కనే ఉన్నప్పటికీ గత ప్రభుత్వ కాలంలో రైతులకు అవసరమైన సాగునీటి పనులను పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభం పల్లి గ్రామంలోని చెరువును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధర్మపురి నియోజకవర్గంలోని రైతుల అవసరాలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. నియోజకవర్గంలో కీలకమైన రోళ్ళ వాగు ప్రాజెక్టు అంచనాలు పెంచి ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశారని అన్నారు.
అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కాగితాలకే పరిమితం అయ్యిందని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తున్నామని అక్కపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేసి 2027 జనవరి 27 వరకు నీటిని ఎత్తిపోస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్తంభంపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేయడంతో పాటు స్థంభంపల్లి చెరువు మత్తడి మరమ్మత్తు, తుముల వెడల్పు మరమ్మతుకు రూ. 5 లక్షల కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
గొల్లపల్లి మండలంలోని యశ్వంతరావుపేట చెరువు పూడికతీత పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మేడారం రిజర్వాయర్ నుండి ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాలకు సాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాపెల్లి శేఖర్, ఎంపీడీవో పాడి వెంకట్ ప్రసాద్, పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మేరుగు మురళి గౌడ్, గుండాటి సందీప్ రెడ్డి, గుమ్ముల వెంకటేష్,సర్పంచ్ లు భూపెల్లి రాజయ్య, దోరిశెట్టి మల్లేశం, బిళ్ళకూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






