11-04-2025 05:31:03 PM
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
బూర్గంపాడు (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలుతో పాటు, గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం గౌతాపురం ఆర్ అండ్ బి నుండి సోంపల్లి జడ్పీ వరకు సుమారు 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu)తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తానని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సదరు గుత్తేదారులు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు.
అనంతరం సారపాక గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడి ప్రథమ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil), ఐటీడీఏ పీవో రాహుల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ డీసీసీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, బట్టా విజయ్ గాంధీ, భజన సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.