24-06-2025 06:28:14 PM
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): వానాకాలం పంటల సాగు కోసం రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ సంబరాల్లో భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ... ఇచ్చినమాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు అని, ఇప్పటి వరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
ఎలాంటి పరిమితులు లేకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికీ పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీపడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ పథకాన్ని కూడా ఇలాగే 2024 ఆగస్టు 15 లోగా పూర్తిచేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఎకరానికి 5 వేలు చొప్పున ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 6 వేల చొప్పున సంవత్సరానికి 12 వేలు చొప్పున రైతులకు అందించడం జరిగిందని, కేంద్రం కొనుగోలు చేయలేని పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తోందని తెలిపారు.