calender_icon.png 25 June, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..

24-06-2025 06:32:32 PM

కట్ట లింగస్వామి డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి..

మునుగోడు (విజయక్రాంతి): మండలంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి(DYFI District Assistant Secretary Katta Lingaswamy) అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకొని అమాయకమైనటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.

పాఠశాలల్లో చేరేంతవరకు వాళ్లకు కల్లబొల్లి మాటలు చెప్పి, పాఠశాలలో చేరిన తర్వాత ఫీజుల పేరుతోటి, బుక్స్, యూనిఫార్మ్స్ పేరుతోటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తాగుతున్నాయని మండిపడ్డారు. ఫీజుల నియంత్రణ పాటించకుండా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు పెంచుకుంటూ పోతూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారని తెలియజేశారు. బలపం పట్టలేని నర్సరీ విద్యార్థులకు కూడా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాల పేరుతో ఐదు నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారని విమర్శించారు. యూనిఫార్మ్స్, స్టేషనరీ, షూ, బెల్టు అమ్మకాలు చేయవద్దని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి యదేచ్చగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయని అన్నారు.

గత సంవత్సరం ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకొని ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు కొంతమంది విద్యార్థులు వెళుతూ ఉంటే అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో స్వయంగా పాఠశాలల ముందు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోటి కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల కమిటీ సభ్యులు రవి, బొడ్డుపల్లి చింటూ, చరణ్, శివ, అరుణ్ ఉన్నారు.