30-06-2025 03:31:51 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడ(Pashamylaram Industrial Area)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(MLA Chinta Prabhakar), ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో ప్రభుత్వం వైఫల్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద పేలుడు జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు హరీశ్ రావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందని, 9 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు. మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదని తెలిపారు. ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి అని, సంఘటన స్థలానికి బాధిత కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు. తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారని, కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీని కలిసి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కంట్రోల్ రూం పెట్టండని, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నారు?, వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు? అని హరీశ్ రావు అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్భుతంగా పని చేస్తున్నది. కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి. డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్, ఎస్పీ ఒక లెక్క చెబుతలేరని చెప్పారు. 5 గంటల నుంచి ఏ వివరాలు లేవని, అంత బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నారని, అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది? అని ప్రశ్నించారు.
ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి. హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?, గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు. 30 శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు, ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి హరీశ్ రావు డిమాండ్ చేస్తున్నారు. మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు. నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారని వాపోయ్యారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ఫెయిల్, కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్, ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్, పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన అని గుర్తు చేశారు.
గతంలో జరిగిన సంఘటనలో ఐదుగురు చనిపోయారు. వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?, ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి. చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.