సమయపాలనపై ఎమ్మెల్యే సీరియస్
మేడ్చల్, మే2 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమయానికి నిర్వహించకపోవడం పట్ల మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. శనివారం కీసరలో ప్రజాపాలన కార్యక్రమంలో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి శాసన మండలి చీఫ్ విప్ పట్న మహేందర్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యేతో పాటు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ లకు కౌన్సిలర్లను ఆహ్వానించారు. మల్లారెడ్డి సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు చేరుకున్నారు. చాలాసేపటి వరకు ముఖ్య అతిథి రాలేదు. దీంతో మల్లారెడ్డి అధికారులను ఎంతసేపు నిరీక్షించాలని ప్రశ్నించారు. గంటల తరబడి ఆలస్యం చేయడంపై సీరియస్ అయ్యారు. చివరికి కార్యక్ర మాన్ని బహిష్కరిస్తూ వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన కాదని కాంగ్రెస్ పాలన లా ఉందని మండిపడ్డారు. వచ్చిన ఆహ్వానితులను గంటల తరబడి నిరీక్షింప చేయడం సరికాదన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ముడి పెట్టారని విమర్శించారు. చెక్కులు వచ్చి రెండు నెలలైనా ఇంతవరకు పంపిణీ చేయకపోవడం ఏమిటని అధికారులను నిలదీశారు. పిల్లలు పుట్టిన తర్వాత పంపిణీ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






