21-02-2026 07:26:02 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శనివారం నాడు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంజారా మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని బంజారా సోదర సోదరీమణులతో కలిసి ఉత్సాహభరితంగా నృత్యం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శి. ఆయన బోధనలు నేటి తరానికి ఆదర్శప్రాయం. బంజారా సోదరులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అని అన్నారు.ప్రభుత్వం బంజారా సోదరుల సంక్షేమం కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి మౌలిక సదుపాయాల కల్పన చేసి విద్య, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బంజారా మహోత్సవాల నిర్వహణ ప్రభుత్వ సహకారంతో బంజారా సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బంజారా సంఘ నాయకులు, బంజారా సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.