దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ సర్కార్
సీఐటీయు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ సంపదను బహుళజాతి కార్పొరేట్ యాజమాన్యాలకు దోచిపెడుతోందని, యువకులు, విద్యార్థులు ఆలోచించాలని సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా యాదగిరిగుట్ట అంబేద్కర్ విగ్రహం ముందు జైల్ బరో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మోదీ పాలనలో సామాన్య ప్రజలపై, కార్మికులపై తీవ్రమైన భారాలు పడుతున్నాయని మండిపడ్డారు. కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును ప్రశ్నార్థం చేస్తూ ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు పెంచుతూ తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.
రైతులకు వర్తిస్తున్న ఉచిత విద్యుత్ నీ ఎత్తివేసే విద్యుత్ సవరణ చట్టాన్ని ఎత్తివేయాలనీ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయడం కోసం వీబీ జి రామ్ జి పథకాన్ని కేంద్రం తీసుకువచ్చిందని దాన్ని రద్దు చేసి పాత మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను ఉపసంహరించుకోవాలనీ లేని యెడల దేశవ్యాపితంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.






