మోదీజీ.. కులగణన ఆపటం నీ తరంకాదు!
న్యూఢిల్లీ, ఆగస్టు 25: కుల గణన విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 74 శాతం మంది దేశంలో కుల గణన నిర్వహించాలని అభిప్రాయపడిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. ‘మోదీజీ.. కుల గణనను ఆపుదామని అనుకొంటున్నారేమో..! అది మీ కల మాత్రమే. దేశంలో కుల గణను ఏ శక్తీ ఆపలేదు. ఇండియా నిర్ణయం వచ్చేసింది. కులగణనకు త్వరలోనే 90 శాతం మంది మద్దతు పలుకుతారు. అందువల వెంటనే కుల గణన చేపట్టండి. లేదంటే తదుపరి ప్రధాని ఆ పని చేస్తారు’ అని హెచ్చరించారు.
వ్యవస్థకు వెలుపలే 90శాతం ప్రజలు
‘కుల అణచివేత కారణంగా భారత్లో 90శాతం ప్రజలు వ్యవస్థకు వెలుపలే ఉండిపోయారు. వారికి నైపుణ్యాలు, తెలివి ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు కారణం? వారిని వ్యవస్థలో భాగస్వాములను చేసి.. మెరుగైన జీవితం గడిపేందుకే కాంగ్రెస్ పార్టీ కుల గణన డిమాండ్ను ప్రతిపాదిస్తున్నది’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆదివారం నిర్వహించిన ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’ సభలో ఆయన మాట్లాడారు.
ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు కుల గణన ఒక సాధనమని తెలిపారు. కుల గణన చేపట్టడడంతోనే కేంద్ర ప్రభుత్వ బాధ్యత తీరిపోదని, సంపద ఎవరి దరి చేరుతోందో ప్రజలందరికీ అర్థం కావాల్సి ఉందన్నారు. కుల గణన కేవలం కులాలగణాంకాలు కాదని, సంపదలో ఎవరికి.. ఎంత భాగస్వామ్యం ఉందనేది తేల్చడం ముఖ్యమన్నారు.






