ఆలయాల్లో తమిళమే వాడాలి
చెన్నై (తమిళనాడు), ఆగస్టు 25: ఆలయ ఆచార వ్యవహారాల్లో తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయాల గర్భగుడిలో కుల వివక్ష ఉండకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని పళనిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ముత్తమిజ్ మురుగన్ అంతర్జాతీయ సదస్సును ఆయన వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరికి భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. వారి నమ్మకాలు, విశ్వాసాన్ని డీఎంకే ప్రభుత్వం గౌరవిస్తుంది.
అలాగే అన్ని మతాలకు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురుగన్ భక్తులను ఒకచోట చేర్చడం.. మురుగన్ ప్రధాన సూత్రాలను వ్యాప్తి చేయడం ఈ సమావేశ ప్రధాన లక్ష్యం అని సీఎం ఉద్ఘాటించారు. అయితే ఇటీవల సనాతన ధర్మం మీద డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.






