19 March, 2026 | 2:53 AM

మురికికూపంగా మొయినాబాద్..

19-03-2026 01:09 AM

మొయినాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. అధికారులు పర్యవేక్షణ గాలికొదిలేయడంతో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. కాలనీలు డంపింగ్ యార్డులను తలపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ప్రజా పాలనప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం మొయినాబాద్లో కేవలం కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంద రోజుల లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రణాళిక ముగింపు దశకు వస్తున్నా, పారిశుద్ధ్యంలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం గమనార్హం. 

ప్రతి వీధిలోనూ చెత్త కుప్పలు పేరుకుపోవడంతో కొత్త కాలనీలు సైతం మురికికూపాలుగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగు నీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో పాదచారులు, వాహనదారులు ప్రయాణించడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. కుళ్లిపోతున్న వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసన, దోమల తాకిడి పెరగడంతో స్థానికులు డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం...

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్ర వీడి, తక్షణమే చెత్తను తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.