17-09-2025 06:23:01 PM
హన్మకొండ,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువజన సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి పిలుపునిచ్చారు. బుధవారం కేయూ మొదటి గేటు వద్ద కేయూ పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మరణించిన అమర వీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, నైజాం నిరంకుశ ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, భూస్వాముల,దొరల దోపిడి అరాచకాలను ఎదురిస్తూ, బాంచన్ దొర నీ కాల్మొక్త అన్న బానిస వ్యవస్థ ఇక చెల్లదని, సామాన్యులను సాయుదులుగా మార్చిన నైజాం అరాచకాలపై తిరగబడి నైజాంను గద్దె దించిన, సాయుధ రైతాంగ పోరాటం దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు నాలుగు వేల మంది ప్రాణ త్యాగం చేశారని, మూడు వేల గ్రామాలను విముక్తి చేశారన్నారు.
10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి, దున్నేవాడికి భూమి ఇచ్చారని, అలాంటి సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్రలేని మతోన్మాద, విచ్చిన్నకర పార్టీలు విమోచన, విలీనం అంటూ చరిత్రను వక్రీకరిస్తూ, మతం రంగును పులుము తున్నారు. మతోన్మాద కుట్రలను తిప్పి కొట్టేందుకు విద్యార్థి, యువత సిద్ధం కావాలన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో మత ప్రమేయం లేదని,కులాలకు అతీతంగా సమానత్వ భావంతో పోరాటం చేసి ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంనియ మన్నారు.