25-06-2025 07:20:45 PM
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పాటైన వైద్య కళాశాల, ప్రధాన ఆసుపత్రిని తెలంగాణ మెడికల్ సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(Telangana Medical Science Infrastructure Development Corporation) ఎండీ ఫణీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma), ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు, టీజీఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ లతో కలిసి సందర్శించారు. ఈ ఫణిదర్ రెడ్డి మాట్లాడుతూ... వైద్య కళాశాలలో ఈ సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థులకు అవసరమైన విద్యా, వసతి, ప్రయోగశాలలు, పరికరాల, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ సంకల్పాన్ని అనుసరించి కళాశాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య కళాశాల, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి పూర్తి నివేదికను వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి సమర్పించనున్నట్లు తెలిపారు. జాతీయ వైద్య కమిషన్ నియమ నిబంధనలు మేరకు కళాశాలలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది వివరాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. పర్యటనలో గుర్తించిన అంశాలపై సమగ్ర నివేదికలు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... విద్యార్థుల వసతి సౌకర్యాల కొరకు సింగరేణి సంస్థకు చెందిన ప్రత్యేక బ్లాక్ కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థుల హాజరు, సిబ్బంది వివరాలను పరిశీలించారు.
నిర్మాణంలో ఉన్న బ్లాకులు, ల్యాబ్లు, మెడికల్ పరికరాలను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కళాశాల నిర్వహణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి, అంతస్థుల నిర్మాణం, వసతులను సమీక్షించారు. పనుల్లో వేగం పెంచి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఓపి, ఇన్ పేషెంట్స్, వైద్య పరికరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ నవీన్ కుమార్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.