18-05-2025 12:45:20 AM
ప్రతి సంవత్సరం మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం నిర్వహించబడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో.. సమాజ అభివృద్ధిలో మ్యూజియాల అవసరాన్ని ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి, పరస్పర సహకారం, శాంతిపట్ల అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ 1977, మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. యువత మ్యూజియాలను సందర్శించే విధంగా విద్యాసంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి.
భారత పురాతన చరిత్ర, వారసత్వంపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పురాతన వస్తువులను మరిన్ని సేకరించాలి. వాటిని భవిష్యత్తు తరాల కోసం భద్రపరచాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మ్యూజియం విశేషాలు, వాటిలోని అపు రూప వస్తువులు, ఆభరణాల వివరాలను వెబ్సైట్లలో ఉంచాలి.
ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యూజియాల విషయానికొస్తే అమెరికాలోని ‘ది మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్’ అద్భుతమైనది. ఈ మ్యూజియంలో చూడటానికి అంత ఇంపుగా లేని చిత్రాలు ఉంటాయి. వాటిని చూడగానే ‘ఇవేం.. కళాఖండాలురా.. బాబూ’ అనుకునే విధంగా చిత్రాలు ఉంటాయి. ఢిల్లీలోని ‘సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్’ కూడా ప్రత్యేకమైనదే.
ఈ మ్యూజియంలో మరుగుదొడ్ల చరిత్ర, పారిశుద్ధ్య వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి అనేక కమోడ్లు, ఇతర సామగ్రి పొందుపరిచి ఉంటాయి. జపాన్ రాజధాని టోక్యోలోని ‘ది మెగురో పారాసైటోలాజికల్ మ్యూజియం’లో మానవులు, జంతువులపై పరాన్నజీవుల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అనేక చిత్రాలు, వస్తువులు, నమూనాలు ప్రదర్శనకు ఉంటాయి. ఇంగ్లాండులోని ‘కార్న్వాల్ విక్రాఫ్ట్ అండ్ మ్యాజిక్ మ్యూజియం’లో మంత్రవిద్య, మాయాజాలం, జానపద కథలకు సంబంధించిన కళాఖండాలు, మంత్రవిద్య పద్ధతులు, వాటి నమ్మకాలకు వస్తువులు ప్రదర్శనకు ఉంటాయి.
నేదనూరి కనకయ్య, హైదరాబాద్