17-06-2025 05:36:27 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని నూతనంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు, రైతు భరోసా పథకంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి(Mandal Agricultural Extension Officer Mutyam Tirupati) కోరారు. మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదికలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిందని, గత యాసంగి నుండి ఇప్పటివరకు నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు, ఇదివరకే పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది రైతు భరోసాలో నమోదు కానీ రైతులు, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా నమోదు అయిన రైతులు ఈ నెల 20 వ తేదీ లోపు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్ లతో పాటు ఫోన్ నెంబర్ జత పరచి రైతు వేదికలో విస్తరణ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.