05-07-2025 12:00:00 AM
జగిత్యాల, జూలై 4 (విజయక్రాంతి): వేదవ్యాస మహర్షి జాతికి అందించిన అష్టాదశ మహా పురాణాలన్నీ సమాజ సంస్కారం కోసమేనని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా 3వ కార్యక్రమం ’శ్రీ నారద మహా పురాణం’ శుక్రవారం కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో ప్రారంభమైంది.
సమితి అధ్యక్ష, కార్యదర్శలు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, నిర్వహణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్ మొదట గురువందన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సమితి సాంస్కృతిక కార్యదర్శి పిన్నంశెట్టి భానుమూర్తి స్వాగతోపన్యాసం చేశారు. ప్రవచనంలో భాగంగా వ్యాసుల వారు రచించిన అష్టాదశ మహా పురాణాలు మానవ శరీరంలోని అంగాలతో సమానమని మహేశ్వర శర్మ వివరించారు.
నారదుల వారి కోసం చెప్పబడింది నారద పురాణమని, నవవిధ భక్తులు, భక్తుల యొక్క గుణగణాలు ఈ నారద పురాణంలో చెప్పడం జరిగిందన్నారు. భారత దేశం గొప్పతనాన్ని, సనాతన ధర్మ ప్రభావాన్ని, గృహస్థాశ్రమ సంప్రదాయాల్ని నారద పురాణంలో వ్యాస భగవానులు చక్కగా వివరించారని డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వొటారి చిన్న రాజన్న, శక్కరి వెంకటేశ్వర్, భోగ శ్రీధర్, వొడ్నాల రామారావు, వనపర్తి చంద్రం, సతీష్, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.