02-12-2025 02:25:32 AM
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, డిసెంబర్ 1(విజయక్రాంతి):జిల్లాలో జాతీయ రహదారి 65 పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో జరుగుతున్న జాతీయ రహదారి65 విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం కలెక్టరేట్లో నేషనల్ హైవే అథారిటీ విభాగం, విద్యుత్, ట్రాఫిక్, పోలీసు , తదితర అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ హెచ్-65 పనులు జిల్లాలో కీలకమైనవని, ఏవిధమైన జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులను ముందుగానే సమగ్ర ప్రణాళికతో అమలు చేయాలని, ఆయా శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. హైవే పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
హైవే పనులను త్వరిత గతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, నేషనల్ హైవే అథారిటీ ఎస్ఈ ధర్మారెడ్డి, ఈఈ రమేష్, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ శాస్త్రి, సంగారెడ్డి ఆర్డీవో రాజేందర్, వక్స్ బోర్డ్, దేవాదాయ, విద్యుత్, ట్రాన్స్పోర్ట్ తదితర విభాగాల అధికారులు, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు పాల్గొన్నారు.