14-06-2025 10:45:02 PM
నిర్మల్ (విజయక్రాంతి): జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకుని ప్రజలు తమ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) సూచించారు. శనివారం పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎస్. శ్రీవాణతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... కేసులు సంవత్సరాలుగా కోర్టుల్లో పెండింగ్లో ఉండటం వల్ల ప్రజలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు రాజీకి వచ్చి త్వరితంగా న్యాయం పొందవచ్చని తెలిపారు. కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చన్నారు.
ఇటీవల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలు, నైతిక విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార శాఖ కళాజాత బృందాల ద్వారా గ్రామాలలో విస్తృత ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, పలు క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఆస్తి గొడవలు వంటి కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులు ప్రజలను లోక్ అదాలత్కు ప్రోత్సహించాలన్నారు. అనంతరం లోక్ అదాలత్ ద్వారా తమ విడాకుల కేసును పరిష్కరించుకున్న భార్యాభర్తలను కలెక్టర్, న్యాయమూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, డిఎల్ఎస్ఎ సెక్రటరీ రాధిక, అడిషనల్ ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నరేందర్, కోర్టు అధికారులు, న్యాయవాదులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.