గురుకుల డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, అంకుషాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్లో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగు భాష గొప్పతనాన్ని చాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు.
భారత క్రీడా రంగానికి మేజర్ ధ్యాన్ చంద్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలుగు భాష ప్రపంచంలోనే గొప్ప భాషల్లో ఒకటని, తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మాతృభాషపై అభిమానం పెంపొందించుకొని, తెలుగు భాషను భావితరాలకు అందించాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో పతకాలు సాధించిన తేజశ్రీ, సౌమ్యలను అభినందిస్తూ మెడల్స్ వేసి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, క్రీడా విభాగం, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.






