ఖాతా లేదు.. ధరలు లేవు..
- దిగుబడి రాక.. రేట్లు లేక రైతుల ఆవేదన
- పెట్టుబడి రావడం లేదని పల్లి రైతు కంటతడి
- విత్తనం కొనుగోలులో రూ. 10 వేల నుంచి రూ 15
- వరకు పలికిన ధర నకిలీ విత్తనాలు కూడా కారణమంటున్న రైతన్నలు
మహబూబ్నగర్ జనవరి 27 (విజయ క్రాంతి): తిను బండారమైన వస్తువైనా ఏదైనా తయారుచేసిన ఆ వస్తువు డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటూ ధరను నిర్ణయించడం తయారీదారుడి హక్కుగా పరిగణిస్తాం. ఇది నిజం కూడా ఇది అందరూ ఒప్పుకుంటారు. ఒక్క రైతు విషయంలో మాత్రం పండించిన పంటకు వ్యాపారస్తులు ధనం నిర్ణయిస్తారు. మార్కెట్లో తయారుచేసిన వ్యక్తికి హక్కు ఉంది.
అవసరం ఉంటే కొనండి... లేదంటే మానేయండి అనే విధంగా వివిధ వ్యాపారాల్లో వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్క రైతు విషయానికి వస్తే మాత్రం మీరు పండించిన పంటకు ధర గింతే ? మీకు ఇష్టమైతే ఇవ్వండి లేదంటే తీసుకుపోండి ? అనే విధంగా వ్యాపారస్తులు రైతులతో వాదిస్తున్న దాఖలాలు లేకపోలేదు. నాలుగు నుంచి ఆరు మాసాలు శ్రమించి పండించిన పంట దిగుబడి అంతంత మాత్రమే ఉండి ధరలు కూడా లేకపోవడంతో వేరుశనగ రైతు కన్నీటి పర్వతమవుతున్నారు.
రాత్రి పగలు శ్రమించి పండించిన వేరుశనగకు ఆశించిన మేరకు ధరలు లేకపోవడంతో రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. పల్లి కొనుగోలు చేయు సమయంలో అధిక ధరకు విక్రయించిన వ్యాపారస్తులు, రైతు విక్రయించినప్పుడు వ్యాపారస్తులు కొనే సమయంలో మాత్రం ధర ఎందుకు లేదని రైతుకు ఎప్పటికీ దొరకని సమాధానంగా ప్రశ్న మిగిలిపోతుంది.
అత్యధిక పల్లికి రూ. 5వేల లోపే..
మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ కు చాలా ప్రత్యేకత ఉంది. జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి అత్యధికంగా పల్లి ఈ మార్కెట్ యార్డ్ కు చేరుకుంటుంది. రోజు దాదాపు 5000 క్వింటాళ్లు పల్లి ప్రస్తుతం వస్తుంది. మంగళవారం మొత్తం 4848 పల్లి మార్కెట్ కు చేరుకుంది.
అత్యధిక ధర 6526 రాగ అత్యల్పంగా దాటిన కేవలం అతి తక్కువ పనికి మాత్రమే రూ 3506 ధర రావడం జరిగింది. అత్యధికంగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయుచున్న పల్లికి రూ 3500 నుంచి రూ 5 వేల మధ్య మాత్రమే ధర పలుకుతుంది. తక్కువ స్థాయిలో మాత్రమే రూ 6600 వరకు క్వింటాల్ కు ధర పలుకుతుంది. దీంతో రైతన్న పెట్టుబడి కూడా రావడం లేదని, ఇలా అయితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ఆవేదనను గుర్తించండి అంటున్న రైతన్న..
రైతులు పంటను పండిస్తారు... వ్యాపారస్తులు ఎంత చెబితే అంతకు అమ్ముకుంటారు... ఇది మా కర్మ ఇంకా ఏం చేస్తాం అనుకుంటూ వెళ్లిపోతారు.. ఈ దృశ్యాలు, ఆవేదన శ్రమించి పండించిన పంట విక్రయించిన ప్రతిసారి రైతులు కలత చెందుతున్నారు. పల్లి కొనుగోలు చేయుసమయంలో అన్ని విత్తనాలు అందుబాటులో ఉంచిన మాదిరిగానే, పల్లి విత్తనాలు కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచి తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు అందిస్తే మేలు జరుగుతుందని రైతులు కోరుకుంటున్నారు.
ఒక పల్లె విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వము పల్లి విత్తనాలను అందించడం లేదనే ఆవేదన రైతుల్లో ఎంతో ఉంది. దీంతో వ్యాపారస్తులు దగ్గరనే వివిధ పేర్లతో లభించే పల్లి విత్తనాలను కొనుగోలు చేసి, అత్యధిక పెట్టుబడి పెట్టి సాగు చేస్తే దిగుబడి రాకపోవడంతో పాటు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు రైతులకు మెండుగా ఉన్నాయి.
ఇకనైనా ప్రభుత్వ ఆలోచనలు రైతులకు దరి చేరాలంటే మన జిల్లాలో అత్యధికంగా పండించే పల్లి రైతులకు కూడా నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి ఉంచి, సరియైన ధరలలో కొనుగోలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎవరికి చెప్పుకున్న.. కన్నీళ్లు తుడిచేవారు లేరు..
సీజన్ వచ్చిందంటే పంట పండించాలి.. మంచిగా లాభం వచ్చేటట్లు చూసుకోవాలి అని ఉంటుంది. గట్లనే అనుకోని పల్లెని పండించిన ఏమి లాభం. ఐదు ఎకరాల్లో పల్లి పంట పండిస్తే 100 సంచలపల్లి అయింది. రెండు లక్షల పైగా ఖర్చు అయింది. అసలు పల్లి ధర తక్కువగా ఉంది. ఎన్ని రోజులు ఇక్కడ ఉండి ఆవేదన చెప్పకుండా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అయ్యా. మా గతికింతే ఏం చేస్తాం. జర సర్కారులు ఆలోచన చేయాలి మా గురించి.
సైదులు, రైతు, పల్లెర్ల గ్రామం, మద్దూరు మండలం చాలా తిప్పల పడ్డాం..
పల్లి పంట వెయ్యాలంటే రాత్రి పగలు నిద్రపోకుండా చేను కాడ ఉండాలి. ఎప్పుడు పందులు వస్తాయో, ఎప్పుడు ఏమి వచ్చి పంట నాశనం చేస్తుందో తెలువక చూసుకుంటూ ఉండాలి. చాలా కష్టపడాలి. అంత పంట పండినంక ఇక్కడికి వచ్చి చూస్తే ధరలు లేవు పంట కూడా చాలా తక్కువగా వచ్చింది. కనీసం ధరలన్నా ఉంటే కొంచెం బాగుండే. పెట్టుబడి కూడా రావడం లేదబ్బా ఏం చేయాలి.
దొబ్బిలి నర్సప్ప, రైతు, బాపనపల్లి గ్రామం






