14-06-2025 12:48:42 AM
కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా. ‘రేవు’ వంటి మంచి చిత్రాన్ని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్టైన్మెంట్స్.. మరో సినిమా ‘వైల్డ్ బ్రీత్’ను ప్రకటించింది. హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ మురళీచంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. రేవంత్ సాగర్ డీవోపీగా, వైశాఖ్ మురళీధరన్ మ్యూజిక్ డైరెక్టర్గా, శ్రీహరి సురేశ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.
శుక్రవారం యువ నిర్మాత పర్వతనేని రాంబాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి శివాజీ రాజా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను లాంచ్ చేశారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా మాట్లాడుతూ.. “నాకు సన్నిహితులైన మీడియా వ్యక్తుల్లో ఒకరైన రాంబాబు నిర్మాతగా ‘వైల్డ్బ్రీత్’ సినిమా వస్తుండటం సంతోషంగా ఉంది.
ఈ మధ్య కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలెన్నో విజయాలు సాధిస్తున్నాయి. కంటెంట్ ఉంటే స్టార్స్ అవసరం లేదు. వారి వెంట పడటం కాదు.. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు” అన్నారు. చిత్ర దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ.. “వైల్డ్బ్రీత్’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని చెప్పారు. చిత్ర నిర్మాత పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. “ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తున్నాయి. హరినాథ్ పులి దర్శకుడిగా ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకుంటాడు” అని తెలిపారు.