07-06-2025 01:50:45 AM
అలంకారప్రాయం అటవీ పరిశోధన కేంద్రం
శిథిలమవుతున్న భవనాలు అలంకారప్రాయం అటవీ పరిశోధన కేంద్రం
మహబూబాబాద్, జూన్ 6 (విజయ క్రాంతి): అటవీ అభివృద్ధి కోసం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 1996లో ఏర్పాటుచేసిన అటవీ పరిశోధన కేంద్రంలో పరిశోధనలు నిలిపివేశారు. దీనితో పరిశోధన కోసం ఏర్పాటు చేసిన భవనాలు, పరికరాలు శిథిలావస్థకు చేరుతుండగా, ఏండ్ల తరబడి కష్టపడి పెంచిన వివిధ రకాల వనాలకు రక్షణ లేకుండా పోతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1996లో అప్పటి ప్రభుత్వం కేసముద్రంలో ఏర్పాటుచేసిన అటవీ పరిశోధన కేంద్రంలో వివిధ రకాల వృక్షజాతి మొక్కలతో పాటు ఔషధ, పండ్ల మొక్కల పెంపకం కోసం ప్రత్యేకంగా నర్సరీ, ప్లాంటేషన్లు ఏర్పాటు చేసింది. అలాగే వివిధ రకాల వృక్ష జాతి పెంపు కోసం ఇక్కడ పరిశోధనలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఉసిరి, టేకు, జామాయిల్, వెదురు తదితర వృక్షాల పెంపుదల కోసం అనేక ఎకరాల్లో వనాలను (ప్లాంట్లు) ఏర్పాటు చేసి పర్యవేక్షించేవారు.
అలాగే ఆధునిక పద్ధతిలో అంటు కట్టే విధానం (క్లొనల్), షెడ్ నెట్ ద్వారా ఔషధ మొక్కల పెంపకానికి ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో వృక్షాల నుంచి సేకరించిన విత్తనాలతో షేడ్ నెట్ కింద క్లోనల్ పద్ధతిలో మొక్కలను పెంచి తిరిగి అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు పంపేవారు. సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో అప్పట్లో ఇక్కడ అటవీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు.
నిర్వహణ కోసం పనిచేసే వారికి క్వార్టర్స్, పరిశోధన కోసం ఆఫీసు బిల్డింగ్, వివిధ రకాల వృక్షాలపై పరిశోధన కోసం 25 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయా రకాల కు చెందిన వృక్షాలను పెంచేందుకు కేటాయించారు. అప్పట్లో ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేశారు. కొంతకాలం పాటు ఇక్కడ పరిశోధనలు, మొక్కల పెంపకం నిర్వహించినప్పటికీ తర్వాత క్రమక్రమంగా అటవీ పరిశోధన కేంద్రాన్ని పట్టించుకోవడం మానేశారు.
కొంతకాలం వరకూ పరిశోధనలు లేకుండానే కేవలం మొక్కల పెంపకం కోసం నర్సరీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో నర్సరీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ నర్సరీ నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో, నర్సరీ కూడా మూతపడింది. పరిశోధన కేంద్ర నిర్వహణకు నిధుల కేటాయింపు నిలిచిపోవడంతో 25 హెక్టార్ల విస్తీర్ణంలో, వసతులతో కూడిన అటవీ పరిశోధనా కేంద్రం ప్రస్తుతం పాలనా పాలన లేకుండా అలంకార ప్రాయంగా మారింది. పరిశోధన కేంద్రంలోని భవనాలు, పరికరాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. 25 హెక్టార్లలో నాటిన ఉసిరి, జామాయిల్, టేకు, వెదురు వనాలకు రక్షణ కరువైంది. దీనితో ఫారెస్ట్ రీసర్చ్ సెంటర్ కాస్త ఇప్పుడు ‘రీసెర్చ్ నిల్’ కేంద్రంగా మారింది.
నిధులు కేటాయించి, పరిశోధనలు చేపట్టాలి
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వేరు పడి మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తర్వాత ఇక్కడ అటవీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అటవీ అభివృద్ధి కోసం కేసముద్రంలో ఏర్పాటుచేసిన రీసెర్చ్ సెంటర్లో తిరిగి పరిశోధనలు ప్రారంభించాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్లక్ష్యానికి గురైన అటవీ పరిశోధన కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తేవాలి.
నిర్వహణ కోసం అవసరమైన నిధులు కేటాయించాలి. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన వసతులను, వనాలను కాపాడుకోవచ్చు. జిల్లాలో అటవీ అభివృద్ధి కోసం అవసరమైన రూపకల్పన , ఆధునిక పద్ధతులతో మొక్కల పెంపు చేపట్టడం ద్వారా ఈ ప్రాంతంలో త్వరితగతిన అటవీ అభివృద్ధికి దోహదపడడంతో పాటు కొంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.