పోడు సాగుదారులపై నిర్బంధాలు వద్దు
పేదల సాగు భూములను స్వాధీనం చేసుకునే చర్యలకు స్వస్తి చెప్పండి
కొత్తగా అడవి ఆక్రమణ జరగకుండా పూర్తి సహకారం
కొత్తగూడెం శాసనసభ సభ్యులు, కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 8, (విజయక్రాంతి): పోడు సాగుదారులపై నిర్బంధాలు ఆపాలని, అనాదిగా సాగుచేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకునే చర్యలకు స్వస్తి చెప్పాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో అటవీ శాఖా అధికా రులు, స్థానిక నాయకులు, పోడు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లాలో, ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో ఏళ్లుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడం వల్ల వారి ఉపాధి దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాగులో ఉన్న భూముల్లో కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం వంటి చర్యల వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కొత్తగా అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా అటవీశాఖ తీసుకునే ప్రతి చర్యకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అడవుల సంరక్షణ ఎంత ముఖ్యమో, పేదవాడి కడుపు నిండడం కూడా అంతే ముఖ్యమని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల వంటి అభివృద్ధి పనులకు అటవీశాఖ అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఫారెస్ట్ క్లియరెన్స్ వేగంగా ఇవ్వాలన్నారు. అటవీ సంరక్షణ, గిరిజనుల సంక్షేమం సమతుల్యంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో ఎఫ్ డి వో బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, రాష్ట్ర రైతు సంఘం నాయకులు ముత్యాల విశ్వనాధం, సిపిఐ మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




