08-06-2025 12:05:16 AM
జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన
కుమ్రం భీం ఆసిఫాబాద్,జూన్7( విజయ క్రాంతి):ఆదివాసీల హక్కులను కాలరాసేలా అటవీ ప్రాంతం నుండి వారిని వెళ్లగొట్టేలా పులుల రక్షణ కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ 49 రద్దు చేయాలంటూ పులులు వద్దు ప్రాణాలే ముద్దు అనే నినాదంతో తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసనకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జిల్లాకు చెందిన నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. పులులు వద్దని ప్రాణాలు ముద్దని ఆదివాసి సంఘం తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఆదివాసీల ర్యాలీలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్,
ఎమ్మెల్యే కోవలక్ష్మి, బిఆర్ఎస్ సిర్పూర్ ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప లు పాల్గొని పులులు వద్దని ఆదివాసీల ప్రాణాలే ముద్దని నినాదాలు చేశారు. ఆదివాసుల గొంతు కోసేలా ఉన్న జీవోను రద్దు చేయకుంటే ఉద్యమం తప్పదని జిల్లా అధ్యక్షుడు విజయ్ అన్నారు.