నిర్బంధ రాజకీయం వద్దు
- మూసీ ప్రాజెక్టుపై మానవ హక్కుల వేదిక ఆగ్రహం
మూసీ నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి
హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి 13 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న వేళ, నగరంలో సామాజిక కార్యకర్తల గృహనిర్బంధాలపై మానవ హక్కుల వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ప్రాజెక్ట్పై నిర్బంధ రాజకీయం వద్దని స్పష్టం చేసింది. ప్రజల నివాస హక్కులను గౌరవించాలని, మూసీ నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని, నదిని శుభ్రం చేయండి.. కానీ పేదలను నిరాశ్రయులను చేయొద్దని ప్రభుత్వానికి చెప్పింది.
గాంధీ సరోవర్ను బాపు ఘాట్ ప్రాంగణానికే పరిమితం చేయాలని, మేధా పాట్కర్ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న తమ సంస్థ నగర కమిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ బిలాల్ను పోలీసులు గృహనిర్బంధం చేయడాన్ని సంస్థ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిర్బంధాలు నిరంకుశత్వమే అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.




