28-11-2025 12:56:17 AM
నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎన్నికల సాధారణ పరిశీలకులు పి. ప్రశాంత్ జీవన్
శంషాబాద్, నవంబర్ 27: శంషాబాద్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గురువారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నారాయణ రెడ్డి, పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు పి. ప్రశాంత్ జీవన్,పరిశీలించారు.మొదటి దశ పోలింగ్ సంబంధించి ఈ నెల 27 నుండి 29 వరకు ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లను పై అధికారుల తో సమీక్షించారు.
పెద్దతుప్ర గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ను పరిశీలించిన అనంతరం, పెద్దతుప్ర, పెద్దతుప్ర తండా, ముచ్చింతల్, మదనపల్లి ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ పరిస్థితిని అబ్జర్వర్ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అదే విధంగా మదనపల్లి, మదనపల్లి కొత్త తాండ, మదనపల్లి పాత తాండ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు.
జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ అభ్యర్థులు సమర్పించే నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి.నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. దాఖలైన నామినేషన్లపై జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపాలి.పరిశీలనలో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్కు అబ్జర్వర్ పలు సూచనలు చేశారు.
ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని వెల్లడించారు.ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలి అని స్పష్టం చేస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సిందిగా అబ్జర్వర్ అధికారులకు ఆదేశించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉన్నా, వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. అబ్జర్వర్ పరిశీలన కార్యక్రమంలో శంషాబాద్ ఎంపీడీఓ మున్ని, తహసీల్దార్లు, సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.